Pages



Sunday, 28 December 2025

దినదిన గండం - నూరేళ్ళ ఆయుష్షు

 "మనకి తిరుగులేదు" అని గట్టిగా అరిచాడు నాయకుడు.

"మనకి తిరుగులేదు" అని బదులు నినదించారు యువసైనికులు.

"మన శక్తికి అవధి లేదు".

"మన శక్తికి అవధి లేదు".

"ఐకమత్యమే మన బలం".

"ఐకమత్యమే మన బలం".

ఇలా కొన్ని నినాదాలు అవ్వగానే ఆ చిమ్మచీకటిలో శిక్షణ మొదలయ్యింది.

శత్రువుల్లో రకరకాలవారు ఎలా ఉంటారో, ఏ శత్రువు ఎటు పొంచి ఉంటారో, అపస్మారకంగా ఉంటే ఎలా బలైపోయే అవకాశం ఉందో చెప్తుంటే, శిక్షణ పొందుతున్నవారంతా కన్నార్పకుండా వింటున్నారు. పెద్దపెద్ద మారణాయుధాలతో ఎలా తమమీద దాడి జరుగుతుందో, ఆహారం దొరకకుండా చేసి, ఆకలిదప్పికలతో చంపేసేలా ఎలా ప్రయత్నాలు జరుగుతాయో, వివిధ జాతుల శత్రువులు మీదపడి అమాంతం ఎలా ప్రాణహాని తలపెట్టగలరో తెలుసుకుంటుంటే వాళ్ళ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

విషప్రయోగాన్ని ఎలా పసిగట్టాలో, ఎన్ని రకాలుగా ప్రయోగం జరిగే అవకాశం ఉందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో సోదాహరణంగా నాయకుడు వివరించాడు. విషాహారాన్ని వాసనతోనే పసిగట్టాలని, దాని దరికైనా చేరకూడదని చెప్పారు. విషవాయువుల జోలికి పోనైనా పోరాదని, ఒకవేళ ఉన్నట్టుండి విషవాయుదాడి జరిగితే సుదీర్ఘకాలం ఊపిరి బిగపెట్టి ఎలా ఆ ప్రాంతంనుండి పరుగులు పెట్టి తప్పించుకోవాలో చెప్తూ, అందుకు అవసరమైన యోగప్రక్రియలు, శరీరదారుఢ్యాన్ని పెంచే వ్యాయామాలను నేర్పారు.

శత్రువుల కళ్ళబడే అవకాశం లేకుండా వెలుతురుని ఎలా తప్పించుకోవాలో, చీకట్లోనే ఆహారాన్ని ఎలా సంపాదించాలో, స్థావరంలోకి ఎలా రవాణా చేయాలో, నాయకుడు సీనియర్ శిక్షితుల సహాయంతో నాటకీయంగా వివరిస్తుంటే ఏకాగ్రతతో నేర్చుకున్నారు.

ఆహారంలో రకాలు, మంచిచెడులు, పౌషిక తత్త్వాలు అన్నిటిగురించి పూసగుచ్చినట్టు కథలుకథలుగా ఆకట్టుకొనే విధంగా చెప్తుంటే అందరికీ నోరూరింది. ఎప్పుడెప్పుడు ఈ సూత్రాలన్నీ వాడి ఆహారాన్ని సంపాదించుకోవాలా అని ఆరాటపడ్డారు. ఆహారనిల్వల ప్రాముఖ్యతను హృదయాన్ని కదిలించేలా వర్ణించిచెప్పారు శిక్షకులు.

వెలుతురులేని ఇరుకైన ప్రదేశాల్లో ఎలా నివసించాలో, సొరంగాల్లాంటి మార్గాల్లోంచి నడుస్తూ, ఎగురుతూ, పాకుతూ ఎన్నిరకాలుగా వెళ్ళాల్సి ఉంటుందో, అన్ని రకాలూ బోధించారు గురువులు.

ఒకరితో ఒకరికి కనుసైగలద్వారా ఎలా సమాచార రవాణా జరగాలో క్షుణ్ణంగా నేర్పారు. చీకట్లో సైతం విధవిధములైన ధ్వనులతో, సంజ్ఞలతో ఎలా కలసికట్టుగా పనిచేయాలో మరచిపోలేని విధంగా శిక్షణనిచ్చారు.

జీవితం అంటేనే జీవన్మరణాల పోటీ అని, శక్తియుక్తులు రెండూ ఉన్నవారే బ్రతికి బట్టకడతారని తెలుసుకొంటూ కర్తవ్యదీక్షతో నిండిన ఒక పెద్ద ఉచ్ఛ్వాసను తీసుకున్నారు శిక్షితులంతా.

అంతటితో భాగ్యనగరంలోని డ్రీమ్ హౌస్ అపార్ట్మెంట్స్ లోని సుబ్బారావుగారి ఫ్లాట్ లోని మూడో బెడ్రూమ్ లో ఈమధ్య పుట్టిన బొద్దింకల గుంపుకి లైఫ్ కోచ్ ఇచ్చే శిక్షణ పూర్తయ్యింది.

సుబ్బారావుగారు, భార్య బొద్దింకలను ఎదుర్కొనే మార్గాలగురించి తలలు బద్దలుగొట్టుకుంటున్నారు. సుబ్బారావుగారి పెద్దబ్బాయి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్ప్రే గురించి వాళ్ళకి చెప్తున్నాడు. ఈ చర్చ పూర్తయి సుబ్బారావు కుటుంబం లైట్లాపి పడుకుంటారని, బొద్దింకలన్నీ ఆహారం కోసం బయటకి వస్తాయని, కడుపు నిండా విందు భోజనం దొరుకుతుందని గోడమీది బల్లిజంట అలా పెళ్లిరోజు జరుపుకోవచ్చని నోళ్ళూరించుకుంటూ ఎదురుచూస్తోంది. కొత్తగా అటకపై కాపురం పెట్టిన ఎలుకల కుటుంబం ఈ బల్లిజంట జిత్తులకు పైజిత్తులు వేస్తోంది.

బొద్దింకల నాయకుడు మాత్రం కనుసైగలతోనే కుర్ర బొద్దింకలకు బల్లిజంటను, ఎలుకలున్న అటకను చూపిస్తూ, టీవీలో వస్తున్న కొత్తరకం బొద్దింకల మందు ప్రకటనను చూపిస్తూ, "ఇహ మీ ప్రతాపం చూపించండి" అన్నాడు.

"మనకి తిరుగులేదు" అని గట్టిగా అరిచాడు బొద్దింకల నాయకుడు.

"మనకి తిరుగులేదు" అని బదులు నినదించారు యువ బొద్దింక సైనికులు.

"మన శక్తికి అవధి లేదు".

"మన శక్తికి అవధి లేదు".

"ఐకమత్యమే మన బలం".

"ఐకమత్యమే మన బలం" అంటూనే వంటింట్లో లైట్ వేసిన సుబ్బారావు భార్యను గమనించి, చీకటి మూలకి జరిగి కూర్చున్నాయి కుర్రబొద్దింకలు.


This story has been published in the souvenir released by Telangana America Telugu Sangham (Telangana American Telugu Association) at the Mega Convention held at Seattle, Washington in May 2024.


https://online.fliphtml5.com/dndlr/nuhg/#p=1


Tuesday, 28 January 2025

విడుదల

2000 సంవత్సరం. జులై నెల.

    

సాయంత్రం ఆరు గంటలయ్యింది. ఎండాకాలం కనుక, అప్పుడే అస్తమించదలచుకోని సూర్యుడు భగభగా మండుతున్నాడు. చేతికున్న 20 ఏళ్ళ వయసున్న తోలు గడియారంలో టైం చూసుకొని, ఆరోజుకి చేయాల్సిన పెయింటింగ్ పని పూర్తిచేసి, గ్లోవ్స్ తీసి పడేసి, వేసుకున్న ఏప్రన్ తీసి, ఇంకా పెయింట్ వేయని ఒక తలుపుకి దాన్ని తగిలించి, కాంట్రాక్టర్ దగ్గర గత రెండు వారాల కూలి డబ్బులు 300 డాలర్లు తీసుకొని లెక్కపెట్టుకొని చొక్కా జేబులో దాచుకొని, మూలనున్న ఖాళీ లంచ్ బాక్స్ చేతపట్టుకొని, రూముకి బయలుదేరాడు గంగారామ్.

2000 సంవత్సరం. జులై నెల.


శుక్రవారం సాయంత్రం పని ముగించుకున్నాక ఇలా అందిన జీతం డబ్బుతో బర్గర్ తినటం అలవాటు చేశాడు హోసే. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే అతనికి ఎవరైనా తన పేరు స్పెల్లింగ్ చూసి "జోస్" అని పిలిస్తే మాత్రం కోపం అంత ఎత్తున వచ్చేది. తన భాష తనకి గొప్ప అని, 'మెహీకో' లో 'జే' అక్షరాన్ని హ అని పలుకుతారని, జోస్ అనేస్తే ఎందుకు పలకాలి అని గొడవచేసేవాడు. తను ఇండియా నుంచి వచ్చినట్టే, మెక్సికో నుంచి బ్రతుకుతెరువు కోసం కోటి ఆశలతో అమెరికా వచ్చి, భార్యాబిడ్డలకి దూరమై, దేశం కాని దేశంలో ఉంటూ, వీసా కాలం చెల్లిపోవటంతో, జైలుశిక్షకి భయపడి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయలేక, పోనీ ఇక్కడైనా నిశ్చింతగా ఉండలేక, ఈ త్రిశంకుస్వర్గంలో రోజులు లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు తనలాగే.


ఎవరో దయతలచి ఒకరిద్దరు బిల్డింగ్ కాంట్రాక్టర్లకి వీళ్ళని పరిచయం చేశారు. వాళ్ళు చెప్పిన పని చేస్తూ, రెండు వారాలకి ఒకసారి జీతం తీసుకుంటూ, ఇంటికి వారానికి ఒక కాల్ చేసి గబగబా ఐదు నిముషాల కాలింగ్ కార్డుతో కబుర్లన్నీ హడావుడిగా మాట్లాడేవారు. సరైన మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవటంతో ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చి పడుతుందో అని భయపడుతూ, జాగ్రత్తగా ఇద్దరూ కాలం వెళ్ళదీసేవారు.


హోసేకి ఆ భయం మరీ ఎక్కువగా ఉండేది. ఆ భయానికి తగినట్టే తీరని అనారోగ్యమూ వచ్చింది. పేదవాళ్ళ క్లినిక్ లో చూపించుకున్నా, డాక్టర్ ఏమీ చేయలేకపోయారు. పదిహేనేళ్ళనుంచి కలసిమెలసి గడిపిన నేస్తాన్ని దూరం చేసుకొని, గంగారామ్ రెండు నెలలక్రితం ఒంటరివాడు అయ్యాడు.


హోసే కాలంచేశాక గంగారామ్ పనిలో జోరు తగ్గింది, నడకలో వేగం తగ్గింది. తనతో మెహీకో కబుర్లు చెప్పేవాళ్ళు లేరు, తన ఇండియా కబుర్లు వినేవాళ్ళు లేరు. బర్గర్ కింగ్ దగ్గర ఆగి ఒక బర్గర్, ఒక సోడా కొనుక్కుని రూము వైపుకి నెమ్మదిగా నడుస్తున్నాడు. దారంతా చెట్ల నీడ. గార్డెన్ స్టేట్ కదా? ఈ వృక్షసంపదకి తోడు జంతుసమృద్ధి. అడపాదడపా జింకలు, రాకూన్లు, బీవర్లు, అలాంటి మరెన్నో చిన్నచిన్న వన్యజాతులు దారికి అడ్డంపడుతూ తిరిగే ప్రాంతం. దారిలో అలాంటి జంతువుల కోసం అటూ ఇటూ చూస్తూ, కిశోర్ కుమార్ పాడిన పాత హిందీ పాటలు పాడుకుంటూ నడవటం అలవాటు తనకి.


నాలుగు రోజులనుంచి ఇంట్లో అర్థరాత్రి టకటకా చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అటకమీద పందికొక్కులు ఉన్నాయేమో అని ఒకటి రెండు బోన్లు పెట్టినా ఏమీ పడట్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ రూముకి చేరాడు. తాళం తీయబోతుంటే, పెరటివైపునుండి  సన్నగా మూలుగులు వినిపించాయి. చుట్టూతిరికి గది వెనక్కి వెళ్ళి చూశాడు. ఒక నక్క, మూడు నక్కపిల్లలు ఆడుకుంటున్నాయి. ముందు కుక్కపిల్లలు అనుకున్నాడు కానీ, సరిగ్గా చూసేసరికి గుండె ఝల్లుమంది గంగారామ్ కి. గబగబా వెనక్కి నడుచుకువచ్చి తాళం తీసి, ఇంట్లోకి వెళ్ళి చటుక్కున తలుపు వేసేసుకున్నాడు. అయితే తనకి వినిపించిన చప్పుళ్ళు ఈ నక్కలవి అన్నమాట అనుకుంటూ, వెనుక వైపున్న అద్దపు కిటికీ దగ్గరకు వెళ్ళాడు.


శనాదివారాల్లో ఆ కిటికీ పక్కనే కుర్చీ వేసుకొని పెరట్లో ఆడుకుంటున్న ఆ నక్క కుటుంబాన్ని చూడటమే కాలక్షేపం అయ్యింది. కాస్త అన్నం వండుకోవటం, ఆ కుర్చీలో కూర్చొని తినటం, టీ కాచుకోవటం, ఆ కిటికీలోంచే  నక్కల్ని చూస్తూ తాగటం. నిద్రపోయే సమయం తప్ప రోజంతా ఇదే పని. తల్లి లాలన, పిల్లల అల్లరి... ఏ జాతి జీవులకైనా ఇంతకుమించిన ముచ్చట ఏముంటుంది?


మరో వారం ఇలాగే గడిచింది. పనికి వెళ్ళేవరకు వాటిని చూడటం, పనయ్యి వచ్చాక వాటిని చూడటం. తల్లి ప్రేమ, పిల్లల అల్లరి చూస్తూ తనకే తెలియకుండా నవ్వుకునేవాడు, మురిసిపోయేవాడు. ఎంతసేపు చూసినా తనివితీరని అందం. ఒకరోజు ఉదయం లేచేసరికి నక్కపిల్లల పక్కన తల్లి లేదు. పిల్లలు ఆడుకుంటున్నాయి. ఆహారం కోసం తల్లి వెళ్ళి ఉంటుంది అనుకొని పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చేసరికి కూడా పిల్లలే ఉన్నాయి, తల్లి లేదు. ఈసారి నిద్రలో ఉన్నాయి. అర్థరాత్రి మూలుగుతున్న శబ్దం విని, పిల్లల్ని చేరదీయాలనిపించినా, చీకట్లోంచి తల్లి వచ్చి మీద పడుతుందేమో అన్న భయంతో ఆగిపోయాడు.


మర్నాడు ఉదయం కూడా తల్లి రాలేదు. పిల్లలు నీరసించిపోయాయి. గంగారామ్ ధైర్యంచేసి ఒక పళ్ళెంలో పాలు పోసి నక్కపిల్లల దగ్గర పెట్టాడు. ఆకలితో ఉన్న పిల్లలు గటగటా తాగేశాయి. తన దగ్గర బిస్కెట్లు, అన్నం తప్ప ఇంకేం లేవు. అసలు నక్కలు మాంసాహారులు కదా, అన్నం తినవేమో అనిపించింది. మరికొన్ని పాలు పోసి, తల్లి తిరిగిరావాలని కోరుకుంటూ పనికి వెళ్ళాడు కానీ మానసంతా ఈ పిల్లలమీదే ఉంది. సాయంత్రం ఇంటికి వస్తూ, తను శాకాహారి అయినా మూడు చికెన్ బర్గర్లు కొనితెచ్చాడు. మొదటిసారి కనుక కష్టం మీద వాటిని తిని పాలు తాగాయి ఆ పిల్లలు.


ఇంకో నెల గడిచింది. తల్లి జాడ లేదు. ప్రమాదమే జరిగిందో, పక్షుల్లాగే నక్కలు కూడా కొంతకాలం చూసి ఇక పిల్లల్ని వదిలేస్తాయో గంగారామ్ కి తెలియలేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. తన ఒంటరితనాన్ని పోగొట్టటానికి వచ్చిన బిడ్డలు ఈ మూడూ. మింటు, చింటు, బంటు అని పేర్లు పెట్టుకొని, వీటి కబుర్లే ఇండియాలోని కుటుంబంతో చెప్పేవాడు. ఇండియా కబుర్లు, హోసే బాబాయ్ కబుర్లు నక్కపిల్లలకి చెప్పేవాడు. కాలానికి మళ్ళీ వేగం పెరిగింది. తెల్లవారటం, పొద్దుక్రుంగటం ఏమీ తెలియట్లేదు గంగారామ్ కి. పనిలో హుషారు పెరిగింది. కిశోర్ కుమార్ పాటలను ఈలవేస్తూ చురుకుగా పెయింట్ చేస్తున్నాడు. నక్కలకి కుక్కల్లా విశ్వాసం ఉండదేమో అని అందరూ హెచ్చరిస్తున్నారు. అయినా గంగారామ్ కి అవి బిడ్డలు. బిడ్డలనుండి తండ్రి ఏం ఆశిస్తాడు? తనకి వాటితో ఉన్న అనుబంధం చెప్పినా వాళ్ళకి అర్థం కాదులే అని నవ్వుకొని వదిలేశాడు.


ఒకరోజు ఇంటికి వచ్చేసరికి, ముంగిట్లో ఒక వ్యాన్ ఆగి ఉంది. వీసా లేని గంగారామ్ కి మనసు కీడు శంకించింది. వ్యాన్ లోంచి దిగిన అధికారులు తాము అటవీశాఖ నుంచి వచ్చామని, వన్యమృగ సంచారం గురించి 911 కి చుట్టుపక్కలవారు కంప్లెయింట్ చేశారని, నక్కపిల్లల్ని తీసుకువెళ్ళాలని అన్నారు. గంగారామ్ కి మొదట నోట మాట రాలేదు. తర్వాత వద్దని వేడుకున్నాడు. నక్కపిల్లల్ని ఉండనిస్తే కలిగే ఇబ్బందులు ఏమిటో, అటవీశాఖ నిబంధనలు ఏమిటో ఆ అధికారులు పూసగుచ్చినట్టు చెప్తున్నా గంగారామ్ కి అవేమీ వినపడట్లేదు, అర్థం కావట్లేదు. మనసంతా ఆందోళన. గుండెల్లో బరువైన రాయి పడ్డట్టు భరించలేనంత ఆవేదన.


అధికారులు వల వేసి మూడు పిల్లల్ని పట్టారు. వ్యాన్ లోకి వేశారు. వాటిని జాగ్రత్తగా అడవిలో వదులుతామని, క్షేమంగానే ఉంటాయని చెప్తున్నారు. గంగారామ్ మాత్రం చేష్టలుడిగి నుంచుండిపోయాడు. వ్యాన్ కనుచూపుమేర దాటి వెళ్ళిపోయింది. గంగారామ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. తనకే తెలియకుండా తను హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.


అప్పగింతలు అయ్యాక తన అల్లుడితో కారెక్కుతూ కిటికీ అద్దం దించి, "ఎందుకు నాన్నా, నన్ను పంపేస్తున్నావు?" అన్నట్టు తనవైపు ఉక్రోషంగా చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టిన కూతురికి తనపై ఇంకా బెంగ ఎక్కువ అవ్వకూడదని, కళ్ళలోనే దాచేసిన కన్నీళ్ళు అవి.


తల్లి మరణించిందని కబురందినా, స్వదేశానికి వెళ్ళలేక, గుండెల్లోనే కుమిలిపోతూ, గొంతులో గాంభీర్యాన్ని కనపరస్తూ ఫోన్లో మాట్లాడినప్పుడు అణచుకున్న కన్నీళ్ళు అవి.


"సర్కారీ ఉద్యోగం వచ్చింది నాన్నా" అని కొడుకు ఫోన్లో చెప్తుంటే మనసంతా నిండిన పుత్రోత్సాహం ఇక చోటు చాలక కళ్ళలోంచి కురవబోతే, "శభాష్, మంచి పేరు తెచ్చుకోవాలి" అంటూ, బేలగా అనిపించకూడదు అని మొహమాటంతో ఆపేసుకున్న కన్నీళ్ళు అవి.


"ఎప్పుడు వస్తారు?" అని భార్య దీనంగా అడిగినప్పుడల్లా "జీవితాంతం తోడు ఉంటానని నీ  కన్నవారికి మాటిచ్చి, చేయి పట్టుకొని అత్తవారింటికి తీసుకువచ్చి, కొన్నాళ్ళు డబ్బు సంపాదించి తెస్తానంటూ విదేశానికి వచ్చేసి, మళ్ళీ కనిపించకుండా, పిల్లల పెంపకం బాధ్యత సైతం నీమీదే వదిలేశాను. నన్ను క్షమిస్తావా?" అని చేయి పట్టుకొని అడగాలని అనిపించినా, ఆ అపరాధభావాన్ని కప్పిపుచ్చుకుంటూ మాటదాటవేసినప్పుడు కారబోయిన కన్నీళ్ళు అవి.


పదిహేనేళ్ళపాటు ప్రతి భావాన్ని పంచుకుంటూ, ప్రతి క్షణం చేదోడువాదోడుగా ఉంటూ గడిపినవాడు, తనకు దేవుడిచ్చిన తమ్ముడు, హోసే తనకి దూరమైనప్పుడు కలిగిన దుఃఖాన్ని నిర్వేదం కప్పేస్తే, వెలికి రావాలని కూడా తెలియక కళ్ళవెనుక దాగిపోయిన కన్నీళ్ళు అవి.


ఇక గంగారామ్ వల్ల కాలేదు. హోసే లాగా తనకి అనాధ మరణం వద్దు. ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో అన్న భయంతో, క్షణక్షణం జీవచ్ఛవంలా బ్రతకాలనిపించలేదు. "ఇక ఎక్కడికీ వెళ్ళను, నీతోనే ఉంటాను" అని భార్యకి చెప్పాలి. మనవలతో ఆడుకోవాలి. పిల్లలతో కూర్చొని నాలుగు మెతుకులు ఆనందంగా తినాలి. తన తల్లిలా పిల్లలకి దూరంగా ఆఖరిక్షణాలు గడపకూడదు.


ఎన్నో ఏళ్ళుగా గుండెలో గూడుకట్టుకున్న ఆవేదన ఈరోజు కట్టలు తెచ్చుకొని పొంగింది. కాసేపటికి కన్నీటి ప్రవాహం ఆగింది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. నేటితో తనకి విడుదల. నిశ్చింతగా పోలీస్ స్టేషన్ వైపుకి అడుగులు వేశాడు. తనని జైల్లో పెట్టినా పర్వాలేదు. కనీసం ఇంకొన్నాళ్ళకి ఇంటికి పంపిస్తారు అన్న నమ్మకంతో నడకలో వేగం పెంచి, ఆనందంగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు.


ఈ కథ "సంచిక" web magazine లో జనవరి 2025 లో ప్రచురితమయింది.


ఆ పత్రికకు లంకె:

https://sanchika.com/vidudala-ay-story/



.

Wednesday, 7 June 2023

మళ్ళీ కథ మొదలు

 కుక్కరు ఏడు కూతలు కూసింది. హాల్లో పేపరు చదువుకుంటున్న విశ్వనాథం వంటింటి వైపు, బెడ్ రూమ్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. సాధారణంగా కుక్కరు పక్కనే నుంచొని నాలుగు కూతలు రాగానే కట్టే భార్య ఈరోజు మూడు అదనపు కూతలకు అవకాశం ఇచ్చిందే అని విస్తుపోయి, తానే వెళ్లి కుక్కరు కట్టి, బెడ్ రూమ్ వైపుకి నడిచాడు. అన్నపూర్ణ మాంచి హడావిడిగా ఉంది. మంచం నిండా ఏడెనిమిది పట్టుచీరలు పెట్టి ఉన్నాయి. వాటిని చూస్తూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటోంది. విశ్వనాథం వచ్చిన అలికిడికి తలెత్తి, "అమ్మయ్య, వచ్చారా? మిమ్మల్నే పిలుద్దాం అనుకుంటున్నాను. మీరే చెప్పండి సుమతి తాంబూలాలకి వీటిలో ఏది బాగుంటుందో" అంది.


    "సుమతికి తాంబూలాలు ఏమిటేవ్? పెళ్లి కుదిరిందేమిటి? అదింకా కాలేజీలో లేదూ?" అన్నాడు విశ్వనాథం. "ఉంటే ఉందిలెద్దురూ. దానికి సంబంధం కుదిరింది, వాళ్ళు చేస్తున్నారు. మధ్య మనకెందుకు అభ్యంతరం? ముందు మీరు చీర గురించి చెబుదురు" అంది అన్నపూర్ణ.


    "నాకేం తెలుసు? పోనీ ఈ చిలుకపచ్చచీర కట్టుకో" అన్నాడు. 


"అది పార్థుగాడి కొడుకు పుట్టినరోజుకి కట్టేశాను కదండీ?" అంది అన్నపూర్ణ.


"కడితే?"


"మీరు భలేవారే. వాళ్ళింట్లోనే ఇంకో పేరంటానికి అదే కడితే అన్నపూర్ణ మొగుడు పాపం దానికి చీరలే కొంటున్నట్టు లేడు" అనుకోరూ? "


"అనుకుంటే అనుకుంటారు. అయినా వద్దనుకునే చీరని ఇలా అన్నిటికీ పైన పెట్టి చూపిస్తే వద్దనుకున్నదని నాకెలా తెలుస్తుందే?"


"పెట్టకముందు గుర్తులేదు. తర్వాత గుర్తొచ్చింది. ఫోన్లో వెతికి ఆ పార్టీ ఫోటోల్లో చూసి రూఢీ చేసుకున్నాను".


"సరే ఈ ఎర్ర చీర కట్టుకో".


"ఏదో మీ అక్కయ్యగారు పెట్టారని ఉంచుకోవాలి తప్ప, అసలు ఆ చీరకి ఆ బోర్డరు ఏమైనా నప్పిందిటండీ?" అంది తిప్పుకుంటూ.


విశ్వనాధం నోరువిప్పి అనేలోపే అన్నపూర్ణ అందుకుంది. "మరి చూడమని పైన ఎందుకు పెట్టావూ అంటారు. అంతేగా? ఉన్న చీర ఎప్పుడో ఒకప్పుడు కట్టాలిగా? తాంబూలాలు అయిపోయాక భోజన సమయంలో కట్టుకుంటాను. ఇది పక్కన ఉంచుదాం. అసలు కార్యక్రమానికి చీర ఏమి కట్టాలో చెప్పండి."


"ఈ వంకాయ రంగు?"


"దానికి ఇంకా జాకెట్ కుట్టించలేదు. ఎల్లుండే తాంబూలాలు."


"పోనీ ఆ నీలం రంగు?"


"మా వరలక్ష్మి వదిన కూడా అదే కడతానంది. ఇద్దరం బ్యాండు మేళంలా ఒకటే రంగు ఎందుకు?"


"అన్నీ నీకే తెలుసు. నన్నెందుకు అడుగుతావు? ఏదో ఒకటి కానివ్వు."


"అంతేలెండి, మీ చెల్లెలికి, వాళ్ళ కూతుళ్ళకి అయితే అడగకుండానే రబ్బరు బ్యాండ్లు కూడా మ్యాచింగులు చెప్తారు. నా దగ్గరికి వచ్చేసరికి ఓపిక ఉండదు."


"ఓపిక లేక కాదు. నీకు ఏం నచ్చుతుందో అర్థం కాక."


"కర్మ, కర్మ, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏం నచ్చుతుందో, ఏం నప్పుతుందో తెలియదు పాపం. సరే, ఈ నెమలి కంఠం రంగు చీర వేసుకోనా?"


"అది చీకట్లో అయితే బాగోదు. పగలే ఆనుతుంది. ముహూర్తం పగలా, రాత్రా? బయటా, లోపలా?"


"ఏమోనండోయ్, అవేమీ ఇంకా నాకు తెలియవు."


"అదేమిటి?"


"మా సుబ్బారావు బావ ఇంకా పిలిస్తేగా? పిలిచినప్పుడు అడుగుతాను."


"ఎల్లుండే తాంబూలాలు అంటున్నావు?"


"ఊళ్ళో ఉండే చుట్టాలమే కదా? రేపనగా పిలిచినా చాలుగా?"


"మనకి చాలు కానీ, అసలు పిలుస్తారంటావా అని."


"పిలవక ఏం చేస్తాడులే కానీ, ఈ గులాబీ రంగు చీర కట్టేసుకుంటాను. మొన్నటి శ్రావణ మాసంలో కొనుక్కున్నదే. ఇంకా ఏ ఫంక్షన్ కీ కట్టలేదు."


ఇంత త్వరగా సెలక్షన్ అయిపోయినందుకు అమ్మయ్య అనుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని, "అవును, ఇదైతే పగలైనా, రాత్రయినా బానే ఉంటుంది" అన్నాడు.


"బోర్డరు కూడా బానే ఉంది. వరలక్ష్మి వదిన ఈ రంగు వేయదు. జాకెట్ కూడా ఉంది. ఈమధ్య కుట్టించినదే కనుక కుట్లు విప్పుకొనే పని కూడా ఉండదు" అంటూ ఆ చీరని శభాష్ అన్నట్టు చరిచి మిగిలిన చీరలన్నీ బీరువాలో సర్దుకోవటం మొదలుపెట్టింది అన్నపూర్ణ.


"ఎవరు పెట్టారేమిటి ఈ చీర?" కుతూహలం ఆపుకోలేక అడిగాడు విశ్వనాథం. "డబ్బు ఇచ్చింది మీరే. పండక్కి కొనుక్కోమని. సెలక్షన్ కి మాత్రం మా అన్నయ్యని తీసుకువెళ్ళాను" అంది. "అదే అనుకున్నానులే" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.


ఆ సాయంత్రం అన్నపూర్ణ ఫోన్ మోగింది. "ఏం వదినా? పిలుపు వచ్చిందా?" అని అటునుంచి వరలక్ష్మి అడిగింది. "లేదు వదినా, నీకు అందిందేమిటి?" అంది కుతూహలాంగా అన్నపూర్ణ. "లేదు వదినా. అసలు పిలుస్తాడంటావా సుబ్బారావన్నయ్య? నేను మా ఆయన్ని సెలవు పెట్టి తాంబూలాలకి తీసుకువెళ్ళాల్సిందే అని గొడవ చేసి మరీ ఒప్పించాను. మధ్యాహ్నమే భాస్కరం గాడితో వెళ్ళి, కొత్తగా చేయించుకున్న రవ్వల గాజులు, దుద్దులు బ్యాంకు లాకర్ లోంచి తెచ్చుకున్నాను. మొన్న సంక్రాంతికి కొనుక్కున్న గులాబీ రంగు చీరకి రాత్రిలోపు జాకెట్ కుట్టమని టైలర్ కి ఇచ్చి వస్తున్నాను" అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పింది వరలక్ష్మి.


"అదేమిటి, నువ్వు నీలం రంగు అన్నావుగా? అలా అన్నావనే నేను గులాబీ రంగు చీర కట్టుకుంటున్నాను వదినా" అంది అన్నపూర్ణ ఆదుర్దాగా. "ఏది? ఆ శ్రావణమాసం నాటిదేనా?" అని అడిగి సమాధానం కోసం ఆగకుండా కొనసాగించింది వరలక్ష్మి. "ఆ గులాబీ లేత గులాబీ. నాది ముదురు గులాబీ. ఏం పర్వాలేదు. కట్టేద్దాం" అని ధైర్యం చెప్పింది. ఇక వరలక్ష్మి వదిన మాటకి ఎదురు చెప్పలేక, వేరే జాకెట్లను సరిదిద్దుకునే ఓపిక లేక ఒక నిట్టూర్పు విడిచి గులాబీ చీరని ఒకసారి అనురాగంతో నిమిరింది అన్నపూర్ణ.


తెల్లారి ఆరింటికి వరలక్ష్మి ఫోనే మేల్కొలిపింది అన్నపూర్ణని. "వదినా, పిలుపు వచ్చిందా?"


"ఇంకా లేదు వదినా. రాత్రేగా మాట్లాడుకున్నాం? ఈలోగా అర్థరాత్రి వస్తుందా పిలుపు?" అని ఒకింత విసుక్కుంది అన్నపూర్ణ.


"ఏమో వదినా. మా ఆయన నా పోరు పడలేక సెలవు పెట్టేశారు. తీరా సుబ్బారావన్నయ్య పిలవకపోతే నా పుట్టింట్లో అటూ ఇటూ ఏడేసి తరాలవారిని ఎండగడతారు. నీకు తెలియనిది ఏముంది చెప్పు? రవ్వల దుద్దులు, గాజులు వేసుకోకుండానే లాకర్ లో దాచాలంటే ప్రాణం ఒప్పట్లేదు. అన్నిటికీ మించి కుసుమకుమారి నన్ను ఒక్క తన్ను తంతుంది తాంబూలాలకి వెళ్ళకపోతే".


"ఆవిడెవరు వదినా?"


"నా టైలరు. ఇంకేముంది, అర్జంటుగా కుట్టమని కాళ్ళకింద నిప్పులు పోసి కుట్టించుకున్నాను".


"నువ్వు మరీను. టైలరు అలుగుతుందని పిలవని పేరంటానికి వెళ్తామా ఏమిటి?"


"అంటే అన్నయ్య పిలవడంటావా?"


"పిలిస్తే వెళ్తాము, లేకపోతే లేదు. పోనీ దుద్దులు, గాజులు ఇప్పుడే వేసేసుకో."


"చాల్లే, చూసేవాళ్ళు నవ్విపోతారు. సరే, పిలుపు అందితే ఒక మెసేజ్ పెట్టు వదినా. మరచిపోకు."


"సరే వదినా. నువ్వు కూడా."


ఈ ఫోన్ కాల్ అయ్యాక అన్నపూర్ణకి, వరలక్ష్మికి ఒక పూట ఒక పుష్కరంలా గడిచింది. గులాబీ చీరని ఇస్త్రీ చేసుకొని, చిన్న బ్యాగులో ఆడపడుచు పెట్టిన చీరని కూడా సర్దుకుంది అన్నపూర్ణ.


రాత్రి పదకొండింటికి మోగింది ఫోను. సుబ్బారావు బావ మొత్తానికి చేశాడు. సంబంధం కుదిరిన వారానికే తాంబూలాల ముహూర్తం అవ్వటం వల్ల కంగారు అయ్యిందని, ఊరు కాని ఊళ్ళో తాంబూలాలు అందుకుంటున్నందువల్ల హడావిడి అయ్యిందని, ఏమిటేమిటో హడావిడిగా చెప్పి, మొత్తానికి "రేపే తాంబూలాలు, రమ్మ"ని చెప్పాడు బావ. ఆ ఫోను పెట్టిందో లేదో వరలక్ష్మి ఫోను.


సస్పెన్స్ సినిమాలో చిక్కుముడి విడినట్టు అన్నపూర్ణ కొంత ఊరట పొందింది. విశ్వనాధాన్ని లేపి మరీ విషయం చెప్పింది. "మొత్తానికి పిలుపు వచ్చిందండీ. నా చీరకి ఇస్త్రీ చేసుకోవటం వృధా అవ్వలేదు, వరలక్ష్మి వదిన రవ్వల దుద్దులు ఉత్తినే లోపలకి పోలేదు, రామబ్రహ్మం అన్నయ్య సెలవు వృధా కాలేదు, అన్నిటికీ మించి కుసుమకుమారి అలగక్కరలేదు".


"ఆవిడెవరు?"


"అదో పెద్ద కథలెండి. మీకు అర్థం కాదు. సుబ్బారావు బావ వద్దనే అనుకున్నాడట. గోపాలం బావ చొరవ తీసుకొని పిలిపించాడట ఊళ్ళోని చుట్టాలని పిలవకపోతే ఎలాగని".


"అయితే వెళ్తావా? ఆఖరి నిముషంలో ఏదో మొహమాటానికి పిలిచారు పాపం. మీ వరలక్ష్మి వదిన ఏమైనా చక్రం తిప్పిందంటావా?"


"చాల్లెండి. భలేవారే. చక్రాలు, శంఖాలు ఎవరు తిప్పినా, పిలిచాక వెళ్ళకపోతే నొచ్చుకోరూ? నేను వెళ్ళాల్సిందే. సరే, పడుకోండి. నేనసలే పొద్దున్నే లేచి వెళ్ళాలి" అంటూ లైటార్పి పడుకుంది అన్నపూర్ణ.


లేత గులాబీ చీరలో అన్నపూర్ణ, ముదురు గులాబీ చీర, రవ్వల నగలతో వరలక్ష్మి, సుమతి తాంబూలాల కార్యక్రమంలో సందడిగా పాల్గొన్నాక, భోజనాల సమయం అయ్యింది. ఆఖరి బంతిలో ముఖ్య కుటుంబసభ్యులతో కూర్చున్నారు వదినలిద్దరూ. పప్పన్నం అయ్యిందో లేదో గట్టిగా ఒక పద్యం వినిపించింది. అంతా సద్దుమణిగారు. మగపెళ్ళివారిలో ఎవరో "భోజనకాలే హరినామ స్మరణ" అంటూ అందుకున్నారు అన్నమాట. తర్వాత ఇటు ఆడపెళ్ళివారిలో ఒక పెద్దాయన పద్యానికి పద్యంతోనే సమాధానం ఇచ్చారు. అటు ఈసారి ఇంకా గట్టిగా ఇంకో పద్యం కుదిరినన్ని సమాసాలను సమోసాలుగా చుట్టేసినట్టున్న పద్యం అది. ఇక ఇటువైపునుండి విచిత్ర పదబంధనాలతో చిత్రవిచిత్రంగా అల్లిన మరో పద్యం.


హాయిగా పద్యాలు వింటూ వంకాయ కారం పెట్టిన కూర తింటోంది అన్నపూర్ణ. ఇక లాభం లేదని అటువైపు నుండి గాయనీమాతల్లులు శ్రావ్యంగా ఒక కృష్ణుడి పాట అందుకున్నారు. ఇటువైపు కూడా పాట పాడాల్సిందే అన్నట్టు ఈలోగా గబగబా ఎవరు ఏం పాడాలని ఆలోచించేసుకుంటున్నారు. అన్నపూర్ణ వైపు చూశారు కొందరు. పక్కనుంచి గోపాలం బావ పిల్లలు మోచేత్తో గుచ్చి "పాడు, పాడు" అంటున్నారు. నోటి నిండా బొబ్బట్టు ముక్క. పాడాలంటే వెంటనే మంచినీళ్ళు తాగాలి. ఇటు కూర్చున్న అనంతలక్ష్మి కూతురు చిన్నారి ఇందాకే తన నీళ్ళ గ్లాసు ఖాళీ చేసి, అన్నపూర్ణ గ్లాసులోంచి కూడా తాగేసింది. అవతల పాట చివరికి వచ్చింది. ఆ చివర కూర్చున్న కాముడు పిన్ని కొరకొరా చూస్తోంది. "చిన్నప్పుడు ఏదో సంగీతం వెలగబెట్టావు కదటే? పాడు మరీ" అంటున్నాయి ఆ కళ్ళు.


"పాడాలనే ఉంది పిన్నీ. నీళ్ళు కావాలి" అంటూ అన్నపూర్ణ సైగ.


ఈ సైగలు చూస్తున్న శ్రీనుగాడు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. తాగి పాడటానికి సిద్ధమయ్యింది అన్నపూర్ణ. ఆడపెళ్ళివారి పాట అవ్వగానే పాడదాం అని గొంతు సరిచేసుకుంది. ఆ కాస్త గ్యాప్ లో మళ్ళీ పద్యాల పోటీ మొదలయ్యింది. మరింత వెతికి వెతికి అల్లసానివారి అల్లికలను, కాళిదాసువారి ఉపమానాలను గుర్తుచేస్తూ ఆడుకుంటున్నారు పండితవర్యులు భోజనం చేయటం మాని.


ఒకొక్క పద్యం అవ్వగానే పాట మొదలుపెట్టాలని అన్నపూర్ణ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎవరో ఒకరు పద్యమో, శ్లోకమో అందుకుంటూ భోజనశాలను ఛందోబద్ధంగా హోరెత్తిస్తున్నారు. పోనీ ఇక మనకి అవకాశం రాదులే తినేద్దాం అనిపించింది అన్నపూర్ణకి.


విస్తరిలో ముక్కల పులుసు వడ్డించేశారు. అది విస్తరి దాటి ప్రవహిస్తుంటే అన్నంతో ఆనకట్ట వేసింది. విస్తరి పక్కన కప్పులో కరిగిపోతున్న ఐస్క్రీమ్ వైపు జాలిగా చూసింది. ఎండిపోతున్న చెయ్యి ఒకవైపు, మళ్ళీ గ్లాసు లాక్కోవాలని చూస్తున్న చిన్నారి ఒకవైపు. కొరకొరా చూస్తున్న కాముడు పిన్ని ఒకవైపు. ఈలోగా ఒక శ్లోకం అవ్వగానే, వరలక్ష్మి వదిన కుర్చీ బిగ్గరగా కిర్రుమని చప్పుడు చేస్తూ గబుక్కున లేచి నుంచుంది. పద్యం ఎత్తుకోబోయిన లక్ష్మణరావు మావయ్య ఆగి ఇటు చూశాడు.


"వదినగారు పిలవాడి మీద కృష్ణుడి పాట పాడారుగా? ఇప్పుడు మా అన్నపూర్ణ మా పెళ్లికూతురు మీద పాట పాడుతుంది" అని కూర్చుంది. తన అవస్థను అర్థం చేసుకున్న వదినకి కళ్ళతోనే థాంక్స్ చెప్పి గబగబా ఒక పాట పాడేసి, పులుసన్నం, పెరుగన్నం తినేసి, ఐస్క్రీమ్ లాగించేసింది అన్నపూర్ణ. కాముడు పిన్ని శాంతించింది. చిన్నారి దాహం తీరింది.


అందరూ అలసిపోయి, భోజనాలు ముగించారు. వరలక్ష్మి వదిన ఒకోసారి మాట మాట్లాడనివ్వకుండా ముందరి కాళ్ళకి బంధం వేస్తుంది కానీ, ఇలా చొరవ తీసుకోవటం తననుంచే నేర్చుకోవాలి అని మరోసారి అనుకొని నవ్వుకుంది అన్నపూర్ణ.


ఇంటికి చేరగానే, రిటర్న్ గిఫ్ట్ టేబుల్ మీద ఉంచి, సుమతి పెళ్ళిలో ఏ చీరలు కడితే బాగుంటుందో వెతుక్కోవటం కోసం బీరువా తెరిచింది అన్నపూర్ణ. ఈలోగా ఫోన్ లో రెండు మెసేజ్ లు వచ్చాయి.


"ఈసారి సుమతి పెళ్ళిలో ప్రతి సందర్భానికి మనిద్దరం ఒకటే రంగు చీర కట్టుకుందామే వదినా" - వరలక్ష్మి వదిన


"సుమతి పెళ్ళినాటికి నాలుగు మంగళహారతులు నెమరువేసుకో. ఈరోజులా నీళ్ళు నమలకు" - కాముడు పిన్ని


ఈ కథ "మధురవాణి" web magazine July-September 2023 త్రైమాసిక సంచికలో ప్రచురితమయ్యింది.


https://www.madhuravani.com/

Saturday, 25 February 2023

వైభోగం


భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకొని, నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్ లో కూర్చుంది. అసలే సంవత్సరాంతం అవ్వటంవల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే, ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయటం కష్టంగా ఉంది. దానికి తోడు రిసెప్షనిస్ట్ విసురుగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. "నేనేం చేయను మేడమ్? మీకంటే ముందు వచ్చినవాళ్ళు ఉన్నారు కదా? మిమ్మల్ని ముందు పంపలేను కదా?" అని అందరికీ వినపడేలా మాట్లాడి, అక్కడే నుంచున్న తనని ఏమాత్రం లెక్కచేయకుండా, ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది ఆమె.

 

"ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం, ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నింటికి చూడాలి కదా? వచ్చేవాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నారా?" అని వాట్సాప్ లో భర్తకి మెసేజ్ పంపి తన అక్కసుని వెళ్ళగక్కి, ఆఫీస్ నుంచి అర్జెంట్ గా సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్ ఏమైనా వచ్చాయేమో అని ఒకసారి ఫోన్లోనే చూసుకొని, మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకొని, ఫోన్ ని బ్యాగ్ లో పడేసి తలెత్తింది.

 

వెయిటింగ్ ఏరియాలో ఒక ఇరవైమంది ఉన్నారు. తనకంటే ముందు ఆరుగురు వెయిటింగ్ లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒకసారి ఆమెవైపు చూసింది భావన. కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ, మధ్యమధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటకి తలాడించి, మళ్లీ తలుపు వేసి వచ్చి కూర్చుంటోంది ఆవిడ. "అన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్టులకి ఉంటుందెందుకో" అని మనసులో తిట్టుకుంటూ కొరకొరా ఆమెవైపు చూస్తుండగా, ఆమె తనవైపు చూసింది. టక్కున ఏమీ ఎరగనట్టు మరోవైపుకు చూపు తిప్పింది భావన. అక్కడ వెయిట్ చేస్తున్నవాళ్ళు అందరూ పెద్దవాళ్ళే. ఎవ్వరికీ యాభైకి తక్కువ ఉండదు వయసు. బాబాయ్ నిన్న ఫోన్ చేసి, పిన్ని రిపోర్టులు పంపుతానని, ఒకసారి ఈ డాక్టర్ కి చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని  అడిగితే, ఆ రిపోర్టుల కాపీలు ప్రింటవుట్ చేసుకొని, ఆఫీస్ లో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడకి. ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు.

    

గోడలమీద నోటీస్ బోర్డులు, వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది. వాటిపై పార్కిన్సన్స్, అల్జీమర్స్, డెమెన్షియా అంటూ రకరకాల రుగ్మతలు, వ్యాధుల పేర్లు, వాటికి సంబంధించి అవగాహన పెంచే రాతలు, బొమ్మలు ఉన్నాయి. ఆ అక్షరాలను తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ, ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతోందో, ఎంత సైజు అక్షరాలకి కష్టపడుతోందో చూసుకొంటూ ఉచితంగా ఐసైట్ టెస్ట్ తనకు తానే చేసుకుంటూ సమయసంహారం కావిస్తోంది. ఈలోపు కుడిపక్కనున్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది.

 

ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్దావిడకి ఒక ఎనభై ఏళ్ళు ఉండచ్చు, ఇంకో ఆవిడకి అరవై దగ్గరపడుతూ ఉండచ్చు అనుకొంది. వృద్ధులు సైతం... ఉన్న చోటుని, సందర్భాన్ని, పక్కవారిని మరచి  ఫోన్లకి అతుక్కుపోతున్న ఈరోజుల్లో, ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈమధ్యే నిర్ణయించుకుంది భావన. అందుకే అవసరమైనంతవరకే ఫోన్ వైపుకి చూస్తూ, మిగతా సమయంలో పాతికేళ్ళ క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్నే చూడాలని తన ప్రయత్నం. ఫోన్ ఎక్కువగా వాడటంవల్ల కలిగే అనర్ధాల గురించి ఆమధ్య ఫోన్లో ఫార్వర్డ్ అయ్యి వచ్చిన ఒక మెసేజ్ చదివాక, తను ఈ నిర్ణయం తీసుకుంది.

 

ఒకసారి హాల్లోని మిగిలిన అందరినీ పరికించి చూసింది. రిసెప్షనిస్ట్ ఎప్పటిలాగే చాలా పని ఉన్నట్టు ఏదేదో టైప్ చేస్తోంది. మిగిలినవారంతా కునుకుపాట్లు పడుతూనో, ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు. కుడిపక్కన కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చొని ఒక చెవి, ఒక కన్ను అటు వేసింది భావన.

 

పెద్దావిడ గొంతు వణుకుతోంది. మాట అంత స్పష్టంగా లేదు. కానీ ముఖంలో ఏదో కాంతి ఉంది. ఆవిడ కుర్చీకి తొంభై డిగ్రీలలో రెండో ఆవిడ కుర్చీ ఉంది.

"మీరూ ఈ డాక్టరు దగ్గరేనా ఎప్పుడూ చూపించుకునేది?" అంది పెద్దావిడ.

"అవునండీ. ఎప్పుడూ ఇక్కడ ఈ వెయింటింగ్ తప్పదు" అని నిట్టూర్చి,

"మీరెలా వచ్చారు ఇక్కడకి?" అని అడిగింది ఎర్రచీర కట్టుకున్న చిన్నావిడ.

"మావాళ్ళు తీసుకొచ్చి దిగబెట్టి, అలా వెళ్ళారులే అమ్మా" అని ఒళ్ళో ఉన్న నీళ్ళసీసాలోంచి నీళ్ళు తీసుకుతాగింది పెద్దావిడ.

"ఇంతకీ మీరు చెప్పండి. అప్పుడు ఏమయ్యింది?" అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ.

"ఏం చెప్పాను? గుర్తులేదమ్మా. ఎప్పటి మాట మీరనేది? నాకు జ్ఞాపకం చేయండి. గుర్తుండదు. పెద్దదాన్ని కదూ?" అంది పెద్దావిడ అభ్యర్థనగా.

"అదేనండీ. మీ బామ్మగారు మాగాయి బద్దలు ఎండబెట్టినప్పుడు" అని అందించింది చిన్నావిడ.

"అదా? దారినపోయే కుర్రవెధవ బద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఒరేయ్ వెధవాయి, మడిగా పెట్టుకున్న మాగాయి బద్దని ముడతావురా? అంటూ మా బామ్మ కర్ర తీసుకొని అదిలించిందిఆ పళంగాను, వాడు ఆ బద్దని నోట్లోంచి తీసి, మాగాయి బద్దలు ఎండబెట్టిన నులకమంచం మీదకి విసిరేశాడు. ఇంకేముంది? మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంటకలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబోదిబోమంది" అంటూ పకపకా నవ్వింది. ఎర్ర చీరావిడ కూడా బాగా నవ్వింది. భావనకి కూడా నవ్వొచ్చినా, వాళ్ళూ తనవైపు చూశారని సర్దుకుంది.

"మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు? మొదటిసారి వచ్చారా?" అని భావనని అడిగింది ఎర్ర చీరావిడ. "అవునండీ. మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను" అని క్లుప్తంగా చెప్పింది భావన. "ఓహో, నేను ప్రతి నెలా వస్తుంటాను" అంది ఆవిడ. "మరి మీరండీ?" అని పెద్దావిడని అడిగింది భావన. "నేనూ వస్తానమ్మా. కానీ చాలా విషయాలు గుర్తుండవు. మావాళ్ళు ఎప్పుడు తీసుకువస్తే అప్పుడే వస్తాను" అని నవ్వింది పెద్దావిడ.

"మీది ఏ ఊరన్నారు?" అని పెద్దావిడ ఎర్ర చీరావిడని అడిగింది.

"రాజమండ్రి నుంచి వచ్చానండీ. నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను" అని జవాబిచ్చింది ఆవిడ.

"మాదీ రాజమండ్రేనమ్మా. చిన్నతనమంతా అక్కడే గడిచింది. కానీ ఆ బ్రిడ్జీ కట్టకముందే తెనాలికి మారిపోయాము. పెళ్ళై కాపురానికి మద్రాస్ వెళ్లిపోయాను. తర్వాత ఆట్టే రాజమండ్రికి వెళ్ళే అవకాశం రాలేదు" అంది పెద్దావిడ.

  "మాది రాజమండ్రి దగ్గర అమలాపురమండీ" అంది ఎర్రచీరావిడ.

"అయితే ప్రభలతీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ? చిన్నప్పుడు మా తాత వేలుపట్టుకొని తీర్థానికి వెళ్ళేవాళ్ళం. జీళ్ళు, చెరుకుగడలు తినేవాళ్ళం" అంది పెద్దావిడ.

"అవునండీ. చాలా బాగా జరుగుతాయి" అని నవ్వింది ఎర్రచీరావిడ.

"మీరెక్కడ ఉంటారమ్మా?" అని భావనని అడిగింది పెద్దావిడ. "మొదటినుంచి హైదరాబాద్ అండీ. ఎక్కడకీ వెళ్ళలేదు ఇన్నేళ్ళలో. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అన్నీ ఇక్కడే" అని మళ్లీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన.

ఎర్ర చీరావిడ అందుకుంది, "మా అమ్మాయికీ నీ వయసే. దానికి ఇద్దరు పిల్లలు. అమెరికాలో ఉంటారు" అని, పెద్దావిడ వైపుకి తిరిగి, "మీ పిల్లలు ఎక్కడ ఉంటారు?" అని అడిగింది.

"నాకు ఒక కూతురు, ఒక కొడుకు. ఎక్కడో ఉంటారు. గుర్తులేదు. ఇది ఏ ఊరు?" అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది పెద్దావిడ. "ఇది హైదరాబాద్ బామ్మగారూ" అంది భావన. ", ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు. మీకు తెలుసేమో" అంది పెద్దావిడ నసుగుతున్నట్టు.

భావనకి ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పటి కబుర్లు మాగాయిబద్దలు, చెరుకుగడలతో సహా గుర్తుపెట్టుకొన్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటా అనుకుంది.

  మాటలతో అస్సలు సంబంధం లేనట్టు, ఎర్ర చీరావిడ టక్కున టాపిక్ మార్చేసింది. "మా మనవలు వచ్చే నెల అమెరికానుంచి వస్తున్నారు. మా అమ్మాయికి మన పిండివంటలు వండిపెట్టే తీరిక ఉండదు. అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా. అయినా ఇంట్లో వండిపెడితే ఆ తృప్తి వేరు కదా?" అంది.

పెద్దావిడ వెంటనే, "అవునమ్మా. మా పిల్లల చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ రెండు రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని. మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి, పిల్లవాడికి జంతికలు నచ్చేవి. మావారికి నూనె వాసన పడేది కాదు. అందుకని నూనె పిండివంటలు చేయాలంటే, పక్కింట్లో వండి, వాళ్ళకి సగం ఇచ్చి, నేను సగం తెచ్చుకొనేదాన్ని" అంది పెద్దావిడ.

"సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు. మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది. వాడికోసం ప్రత్యేకంగా చేస్తాను" అంది ఎర్ర చీరావిడ.

"పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసినా, బెల్లంపాకంతో సున్నుండలు చేయండమ్మా, వంటికి బోలెడు బలం. ఎదిగే పిల్లలు కదూ?" అంది పెద్దావిడ.

"మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటై పాకం తీయటమే మానేశాము ఈమధ్య. మీరు చెప్పారుగా, అలాగే చేస్తానులెండి" అంది ఎర్ర చీరావిడ.

"మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది. రెండు బుగ్గల్లో రెండు సున్నుండలు కుక్కుకొని, చప్పరిస్తూ వెళ్ళేది బడికి" అని మురిపెంగా చెప్పింది పెద్దావిడ.

వీళ్ళ కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతోంది భావనకి. పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు, కొన్ని కథలు, కబుర్లు, మద్రాస్ విశేషాలు, మంగళహారతులు తెలిశాయి ఆ కాసేపటిలోనే. పిల్లల పెంపకంలో 50లలోను, 70లలోను, 90లలోను ఉన్న తేడాలు కూడా తెలిశాయి.

రిసెప్షనిస్ట్ ని చూస్తూ పళ్ళు నూరటంకంటే చాలా మంచి కాలక్షేపం అయ్యిందనుకుంది. ఈలోగా నలుగురైదుగురు పేషెంట్స్ లోపలకి వెళ్లి వచ్చినట్టున్నారు. ఒకొక్కరితోను ఎక్కువసేపే గడుపుతున్నారు లోపలున్న డాక్టర్. అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకషంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు. అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా, ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది.

మరొక్కసారి ఈమెయిల్ చెక్ చేసుకుంటే నయం అనుకొని, ఫోన్ బయటకి తీస్తుండగా, రిసెప్షనిస్ట్ వీళ్ళ దగ్గరకి వచ్చి, "ఆంటీ, మీ తిరునాళ్ళు, ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకొని వెళ్ళండి, లోపలి పేషెంట్ బయటకొచ్చాక" అని నవ్వి, ఆమె వెయింటింగ్ హాల్ చివరనున్న బాత్రూమ్ వైపుకి వెళ్లింది.

భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీళ్ళు ఇక్కడే కలిసినట్లు మాట్లాడుకున్నారే అనుకుంటుండగా, తనకంటే పెద్దావిడ మరింత అవాక్కవ్వటం గమనించింది. పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి, "నువ్వు నా కూతురివా?" అంది. ఎర్ర చీరావిడ "అవునమ్మా, దా, నెమ్మదిగా లే" అంటూ ఆవిడని రెక్క పుచ్చుకొని లేపి, వీల్ చెయిర్ లో కూర్చోపెట్టింది. "నా కూతురివేనేమిటే నువ్వు?" అంటూ ఏదో ఆలోచించి, అయోమయంలోంచి ఆనందంలోకి ముఖకవళికలు మార్చింది పెద్దావిడ. "అవునమ్మా, నేనే, సుజాతనే" అంది కూతురు నవ్వుతూ. "అవునేవ్, ఎవరో అనుకున్నాను. డాక్టర్ పిలిచారా?" అంటుండగా, "ఉంటామండీ" అని భావనకి కళ్ళతోనే వీడ్కోలు పలికి, చిరునవ్వుతో వీల్ చెయిర్ తోసుకుంటూ లోపలకి తీసుకువెళ్లింది సుజాత.

ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి, తన సీట్లో తను కూర్చుంది. భావన ఇక ఆగలేకపోయింది. విసుక్కున్నా పర్వాలేదని, ఆవిడ దగ్గరకు వెళ్లి, "వాళ్ళు తల్లీకూతుళ్ళా? ఇక్కడే ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుకున్నారే?" అంది. ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతోందో తను పట్టించుకోలేదు. ఆఫీస్ కి వెళ్ళాలి అనే కంగారు తనలో లేదు. అర్జెంట్ ఈమెయిల్ వచ్చాయేమో చూసుకోనేలేదు. ఆవిడ చెప్తున్నది ఆసక్తిగా వింటోంది.

"ఆ పెద్దావిడకి 85 ఏళ్ళుంటాయి. గత పదేళ్ళుగా ఆవిడ ఇక్కడకి వస్తున్నారు. మొదట్లో కొడుకు తీసుకువచ్చేవారు. కానీ ఆమధ్య కొడుకు చనిపోయారట. ఈవిడ కూతురు. అప్పట్లో వేరే దేశంలో ఉన్నా, తమ్ముడు చనిపోయాక, తల్లి మానసికంగా కూడా చితికిపోవటంతో అన్నీ మానుకొని అమ్మని చూసుకోవటం కోసం ఇక్కడకి మకాం మార్చుకున్నారు. ఈ పదేళ్ళలో పెద్దావిడ జ్ఞాపకశక్తి అంతకంతకీ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు" అంది.

"మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా?" అంది భావన.

"అదే అల్జీమర్స్ వ్యాధి లక్షణం. బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి. కానీ, ప్రస్తుత విషయాలు గుర్తుండవు. ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తోంది. మాట కూడా ఈమధ్య బాగా అస్పష్టంగా వస్తోంది పాపం. అయినా కూతురు కబుర్లు చెప్తుంటే, కూతురని కూడా గుర్తుపట్టకపోయినా, కష్టపడి మాట్లాడుతున్నారు. ఉన్నన్నాళ్ళూ ఆవిడని సంతోషంగా ఉంచాలనే సుజాతగారి ప్రయత్నం. అందుకే కూతురునని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేనూ ఒకసారి అడిగాను, రోజూ అవే కబుర్లు విన్నా, మళ్లీ కొత్తగా ఎలా వింటున్నారు అని. అమ్మ నవ్వుతోంది కదా, అదే చాలంటూ నవ్వుతారు. ఆవిడకి ఉన్న సహనం, శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తుంది.

నమ్ముతారో లేదో, ఈ ఎనిమిదేళ్ళలో నేనే మాగాయిబద్దలు, తిరునాళ్ళు, మంగళహారతుల గురించి వందలసార్లు విన్నాను. వాళ్ళు వచ్చేది నెలకొకసారే. మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు-రాత్రి విని ఉంటారు? అయినా మళ్లీ, మళ్లీ వింటారు, మళ్లీ మళ్లీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు. ఎప్పుడైనా ఆవిడకి తన కొడుకు మరణమో, ఇంకేమైనా పాత విషయాలో గుర్తొచ్చి బాధ కలుగుతోంది అనిపిస్తే, ఇంకేదో విషయంలోకి వెళ్లిపోతారు. ఆ మహాతల్లి అదృష్టం, కూతురు టాపిక్ ని మార్చిందని కూడా పసిగట్టలేని పసి మనసు ఆవిడది. ఆవిడ మంచాన ఉండచ్చు, ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, తన పని తను చేసుకోలేకపోవచ్చు, అన్నం తినాలన్నా చేతులు వణకచ్చు, లేచి నాలుగు అడుగులు వేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు, ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు" అంది రిసెప్షనిస్ట్.

ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరకి వెళ్లి డాక్టర్ చెప్పే మాటలకి తలాడించి, మళ్లీ వచ్చి కూర్చొని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది. భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. లోపల డాక్టర్ తల్లీకూతుళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ భావనకి ఆలస్యం అయిపోతోందన్న కంగారు లేదు. గుండెల్లో ఏదో బరువు. అది బాధ కాదు, భయం కాదు, ఆనందం కూడా కాదు. ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ తల్లీకూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ, ఆ పెద్దావిడ కబుర్లు వింటూ, ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు, ఆ పెద్దావిడ ముద్ద మాటలమధ్య బోలెడు జీవితసారం, ఆవిడ బోసినవ్వు.. ఇవన్నీ తన కళ్ళలోనే ఆడుతున్నాయి.

జ్ఞాపకశక్తి పోవటం ఆ పెద్దావిడకి శాపమా, వరమా? ఇందాక నోటీస్ బోర్డ్ లో కరపత్రాలపై ఉన్నవి చదివింది. నిత్యజీవితంలో చిన్నచిన్నవి కూడా మరచిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు. వస్తువులు ఎక్కడ పెట్టారో మరచిపోవటం, ఏం చెప్పాలనుకున్నారో మరచిపోవటం, ఉన్న చోటు ఏదో, జరుగుతున్న తారీఖు ఏదో మరచిపోవటం, ఏదో చేయాలనుకొని లేచి అదేమిటో మరచిపోవటం... వెరసి నిత్యజీవితం ఒక గందరగోళంగా మారుతుందట.

కానీ, అవన్నీ పెద్దావిడని ఏం బాధపెట్టలేవు. హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతోంది. ఒకప్పటి కష్టాలు, కన్నీళ్ళు, అవి గుర్తుచేసే సంఘటనలు, మనుషులు ఆవిడ చుట్టూ లేవు. ఒకవేళ గుర్తొచ్చినా, అవి మరపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటోంది. ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది? ఆవిడ అందరికంటే సంపన్నురాలు. అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం. కన్నందుకు ఆవిడపట్ల కూతురు తీర్చుకుంటున్న ఋణం ఈ ఆనందం. ఇంతకంటే వైభోగం ఏముంటుంది?

ఒక్క గంట క్రితం ఉత్తి పుణ్యానికి తనకి ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది. తన వంతు వచ్చేవరకు ఎదురుచూడమంది చెప్పింది, అంతేగా? దానికి ఎంత అసహనం కలిగింది తనలో? నిజానికి ఈ తల్లీకూతుళ్ళ పట్ల ఆవిడకున్న గౌరవభావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశీల్యం కనిపించింది. తనలోని అసహనం వల్ల, తనలోని శాంతం వల్ల ఒకే మనిషి రెండు రకాలుగా కనిపించింది కదా అనిపించింది. మరి మరోపక్క సహనానికి ఎర్ర చీర కట్టినట్టున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతోంది.

రిసెప్షనిస్ట్ "అనసూయమ్మ గారి అటెండెంట్!" అని తనని పిలవటంతో లోకంలోకి వచ్చి, కళ్ళు తుడుచుకొని లేవటానికి సిద్ధమై, బ్యాగ్ భుజాన వేసుకుంటూ, నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకొని బయటకి వస్తున్న వీల్ చెయిర్ వైపుకి చూసింది. రెండవ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వుముఖాన్ని చూడటానికో, తల్లిని పసిపాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కల్మషమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో, వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడ్కోలు పలుకుదామనో తెలియదుగానీ, మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురుచూస్తూ, డాక్టర్ గదివైపుకి అడుగులు వేసింది భావన.

This story has been published in Eenadu Sunday magazine on February 26, 2023. Here is the link:


 https://www.eenadu.net/telugu-article/sunday-magazine/eenadu-sunday-story/7/323000248